ఎల్ఓసీ(LOC), ఎల్ఏసీ(LAC), రేఖలకు అర్థం ఏంటి ? సరిహద్దు ?

✊ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ), వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)
👉 భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ
👉 భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ
👉 సియాచిన్: యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్
👉 భారత్-భూటాన్ సరిహద్దు
👉 భారత్-నేపాల్ సరిహద్దు
👉 భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు


👉లిపులేఖ్, కాలాపానీల విషయమై భారత్, నేపాల్‌‌లకు ఏర్పడిన వివాదం సద్దుమణగక ముందే భారత సైనికులు, చైనా సైనికుల మధ్య ఘర్షణ రేగింది. 
✊ ఈ ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అని పిలుస్తారు.
✊ పాకిస్తాన్, చైనా, నేపాల్‌లతో భారత సరిహద్దు వివాదాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నియంత్రణ రేఖ (ఎల్ఏసీ), వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని మనకు పదేపదే వినిపిస్తుంటాయి.

👉 అసలు ఈ రేఖలకు అర్థం ఏంటి? వాటి మధ్య తేడాలేంటి?

భారత్‌కు మొత్తంగా ఏడు దేశాలతో 15,106.7 కి.మీ.ల పొడవైన భౌగోళిక సరిహద్దు ఉంది. సముద్ర జలాల సరిహద్దు పొడవు 7516.6 కి.మీ.లు.
బంగ్లాదేశ్ (4,096.7 కి.మీ.లు), 
చైనా (3,488 కి.మీ.లు), 
పాకిస్తాన్ (3,323 కి.మీ.లు), 
నేపాల్ (1,751 కి.మీ.లు), 
మయన్మార్ (1,643 కి.మీ.లు), 
భూటాన్ (699 కి.మీ.లు), 
అఫ్గానిస్తాన్ (106 కి.మీ.లు)లతో ఈ భౌగోళిక సరిహద్దులు ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.

👉 భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ

✊ చైనాతో భారత్ భౌగోళిక సరిహద్దు పొడవు 3,488 కి.మీ.లు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల గుండా ఇది ఉంది.
✊ ఈ సరిహద్దును మూడు సెక్టార్లుగా విభజించారు. ఒకటి పశ్చిమ సెక్టార్, అంటే జమ్మూకశ్మీర్. మరొకటి మిడిల్ సెక్టార్, అంటే హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్. మూడోది తూర్పు సెక్టార్, అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.
భారత్, చైనాల మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగలేదు. కొన్ని ప్రాంతాల విషయమై ఇంకా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

✊ పశ్చిమ సెక్టార్‌లోని అక్సాయ్ చిన్ తమ భూభాగమని భారత్ అంటోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. 
✊ భారత్‌తో 1962లో జరిగిన యుద్ధం సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది.
మరోవైపు తూర్పు సెక్టార్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని, ఇది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా అంటోంది. టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉన్న మెక్‌మోహన్ రేఖను చైనా అంగీకరించడం లేదు. 
అక్సాయ్ చిన్ తమదని భారత్ చేస్తున్న వాదనను కూడా ఆ దేశం ఖండిస్తోంది.
ఈ వివాదాలన్నింటి కారణంగా భారత్, చైనాల మధ్య సరిహద్దులు నిర్ణయం కాలేదు. యథాస్థితిని కొనసాగించేందుకు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అనే పదాన్ని వాడతారు. 
అయితే, ఈ రేఖ విషయంలోనూ అస్పష్టతలు ఉన్నాయి. భారత్, చైనా ఎల్ఏసీల మధ్య తేడాలున్నాయి.
ఎల్ఏసీ వద్ద మంచు పర్వతాలు, హిమనీనదాలు, మంచు ఏడారులు ఉన్నాయి. ఇక్కడి ప్రాంతాల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి.

👉 భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ

✊ ఏడు దశాబ్దాలు గడిచినా, భారత్, పాకిస్తాన్‌ల విభేదాలకు కశ్మీర్ ఇంకా ప్రధానాంశంగా ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని నియంత్రణరేఖ విభజిస్తోంది. దీనికి ఒకవైపు ప్రాంతం భారత్ నియంత్రణలో, మరోవైపు ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణలో ఉంది.
✊ 1947-48లో భారత్, పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ విషయమై మొదటి యుద్ధం జరిగింది. ఐరాస పర్యవేక్షణలో ఈ యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం యుద్ధ విరమణ సరిహద్దు రేఖ ఏర్పడింది. దీని కింద జమ్మూకశ్మీర్‌లోని మూడింట ఒక వంతు భాగం పాకిస్తాన్ వద్ద ఉంది. దాన్ని పాకిస్తాన్ ‘ఆజాద్ కశ్మీర్’ అని పిలుస్తోంది.
మిగతా రెండు వంతుల భాగం భారత్ వద్ద ఉంది. ఇందులో జమ్మూ, కశ్మీర్ లోయ, లద్దాఖ్ ప్రాంతాలున్నాయి. 1972 యుద్ధం తర్వాత శిమ్లా ఒప్పందం జరిగింది. ఇందులో యుద్ధ విరామ రేఖకు ‘నియంత్రణ రేఖ’ అని పేరు పెట్టారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఈ నియంత్రణ రేఖ 740 కి.మీ.ల పొడవు ఉంది.
✊ పర్వతాలు, నివసించేందుకు ప్రతికూలమైన ప్రాంతాల గుండా ఇది సాగుతుంది. ఈ నియంత్రణ రేఖ కారణంగా కొన్ని చోట్ల గ్రామాలు, పర్వతాలు కూడా రెండుగా విడిపోయాయి.
నియంత్రణ రేఖ వద్ద భారత్, పాకిస్తాన్ సైనికుల మోహరింపుల మధ్య కొన్ని చోట్ల వంద మీటర్ల దూరమే ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ఐదు కి.మీ.ల వరకూ దూరం ఉంటుంది.
✊ నియంత్రణ రేఖపై భారత్, పాకిస్తాన్‌లకు 50 ఏళ్లుగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
✊ ఆ రేఖ ఇప్పటికీ దాదాపుగా 1947 యుద్ధం సమయంలో నిర్ణయించినట్లుగానే ఉంది.
✊ అప్పుడు కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో యుద్ధం జరిగింది. ఉత్తర ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం కార్గిల్ పట్టణం నుంచి వెనక్కివెళ్లగొట్టింది. శ్రీనగర్ నుంచి లేహ్ ప్రధాన రహదారి వరకు మళ్లించింది. 1965లో మళ్లీ యుద్ధం జరిగింది. కానీ, పోరాటంలో ప్రతిష్ఠంభన కారణంగా 1971 వరకూ యథాస్థితి కొనసాగింది.
✊ 1971లో మరోసారి యుద్ధం వచ్చింది. దీని తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఏర్పడింది.
ఆ సమయంలో కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో యుద్ధం జరిగింది. నియంత్రణ రేఖ వద్ద ఒక దేశపు పోస్టులు ఇంకో దేశం నియంత్రణలోకి వచ్చాయి. 300 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ప్రాంతం భారత్ నియంత్రణలోకి వచ్చింది. నియంత్రణ రేఖ ఉత్తర భాగంలోని లద్దాఖ్‌లో ఈ ప్రాంతం ఉంది.
✊ 1972లో శిమ్లా ఒప్పందం, శాంతి చర్చల తర్వాత నియంత్రణ రేఖ మళ్లీ ఏర్పడింది. చర్చల ద్వారా వివాదం పరిష్కారమయ్యేవరకు యథాస్థితిని కొనసాగించాలని రెండు దేశాలూ నిర్ణయానికి వచ్చాయి. ఐదు నెలల పాటు ఫీల్డ్ కమాండర్లు దాదాపు 20 పటాలు ఒకరితోఒకరు పంచుకున్నారు. చివరికి ఒప్పందం జరిగింది.
✊ ఇది కాకుండా పాకిస్తాన్‌తో భారత్‌కు రాజస్థాన్, గుజరాత్, జమ్మూ, గుజరాత్‌ల్లో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

👉 సియాచిన్: యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్

✊ సియాచిన్ హమనీనదం ప్రాంతంలో భారత్, పాకిస్తాన్‌లకు మధ్య ‘యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్’ ఉంది. 126.2 కి.మీ.ల పొడవైన ఈ రేఖ వెంబడి భారత సైన్యం గస్తీ కాస్తుంది.
✊ 80వ దశకం నుంచి అతి భీకర సంఘర్షణ ఈ సియాచిన్‌లో కొనసాగుతుంది.
శిమ్లా ఒప్పందం సమయంలో ఈ ప్రాంతపు సరిహద్దులను నిర్ణయించలేదు. 
అత్యంత ప్రతికూలమైన ఈ ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకోవడం అవసరం లేదని రెండు దేశాలూ భావించడమే అందుకు కారణమని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు.
చైనా నియంత్రణలో ఉండి, భారత్ తమవని చెబుతున్న ప్రాంతంలోని ఓ భాగంపై రేఖ నిర్ణయించాల్సి వస్తుండటం కూడా ఇందుకు మరో కారణమని అభిప్రాయపడుతుంటారు.

👉 భారత్-భూటాన్ సరిహద్దు

✊ భూటాన్‌తో భారత్‌కు 699 కి.మీ.ల పొడవైన సరిహద్దు ఉంది. సశస్త్ర సీమా బల్ ఇక్కడ భద్రత విధులను నిర్వర్తిస్తోంది.
✊ భూటాన్‌తో భారత్‌లోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది.

👉 భారత్-నేపాల్ సరిహద్దు

✊ ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలతో నేపాల్‌కు సరిహద్దు ఉంది. ఈ మొత్తం సరిహద్దు పొడవు 1751 కి.మీ.లు. ఇక్కడ కూడా సశస్త్ర సీమా బల్ భద్రత విధుల్లో ఉంది.
✊ భారత్, నేపాల్ సరిహద్దులు ఎక్కువగా తెరుచుకునే ఉంటాయి.
✊ అయితే, ఇప్పుడు మాత్రం ఈ సరిహద్దుల్లో సైనికుల మోహరింపు పెరిగింది. రెండు దేశాల మధ్య సరిహద్దులు పూర్తి స్థాయిలో నిర్ణయం కాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మహాకాలీ (శారదా), గండక్ (నారాయణీ) లాంటి నదులు కొన్ని ప్రాంతాల సరిహద్దులను నిర్ణయిస్తాయి. అయితే, వర్షాకాలంలో నీట వరద ఎక్కువగా ఉన్నప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటున్నాయి.
✊ నదులు ప్రవాహం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. చాలా ప్రాంతాల్లో సరిహద్దుల నిర్ణయించే పురాతన స్తంభాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ, స్థానికులు వాటిని అంగీకరించరు.

👉 భారత్-మయన్మార్ సరిహద్దు

✊ మయన్మార్‌తో భారత్‌కు 1643 కి.మీ.ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో 171 కి.మీ.ల పొడవైన సరిహద్దు రేఖలు ఇంకా నిర్ణయం కాలేదు.
✊ మయన్మార్‌తో భారత సరిహద్దుల్లో అసోం రైఫిల్స్ విధులు నిర్వర్తిస్తుంది.

👉 భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు

✊ 4096.7 కి.మీ.ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు పర్వతాలు, మైదానాలు, అడవులు, నదుల గుండా సాగుతుంది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా ఎక్కువగానే ఉంటుంది.
✊ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) గస్తీ కాస్తుంది.
✊ భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు ఒక కి.మీ. దూర పరిధిలో బీఎస్ఎఫ్ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రాంతం స్థానిక పోలీసు పరిధిలోకి వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu