✌ పంట బీమా పథకాలు.. ఎలా ఉంటాయి ??

✌ పంట బీమా పథకాలు...
✌ నష్టపరిహారం పొందే ప్రక్రియ ఏమిటి 
✌ వర్షాధార పంటల కోసం మరో బీమా పథకం

 



✌ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతుల కోసం రెండు రకాల బీమా పథకాలు అమలులో ఉన్నాయి. అందులో  ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమైంది. ఈ పథకంలో భాగంగా 7 రకాల పంటలకు బీమా అమలులో ఉంది. ఇందులో గ్రామాన్ని యూనిట్‌గా పరిగణిస్తున్నారు.
✌ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను 2016-17 ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్నారు. ఈ పథకంంలో రైతు వాటాతో పాటుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా ఇన్సూరెన్స్ ప్రీమియం వాటా చెల్లిస్తాయి.
✌ తొలి ఏడాది 17.79 లక్షల మంది రైతులకు ఈ పథకం అమలు కాగా, 2019-20లో 58.77 లక్షల మందికి చెందిన 56.82 లక్షల హెక్టార్లలో పథకం అమలు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 37,727 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ కోసం తమ వాటాగా 1030.74 కోట్లు వెచ్చించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
✌ ఇక క్లయిమ్స్ సంగతికి వస్తే రూ. 94.03 కోట్లకు గానూ ఇంకా రూ. 24.83 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ వ్యవసాయ శాఖ వెబ్‌సైట్ చెబుతోంది.


 అమలు ఇలా...
1. పంట సాగు చేసే వారు తమ వివరాలు ఆ పంట కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కేంద్రాల్లో ఉండే వ్యవసాయ అసిస్టెంట్లను సంప్రదించాలి. ఈ పంట కింద నమోదయిన వారి వివరాలను బీమా అమలు కోసం కూడా వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
2. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పేరుతో ప్రాంతాల వారీగా పంటలకు బీమా వర్తింపజేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక ప్రధాన పంటకు గ్రామాన్ని ఒక యూనిట్‌గా నిర్ధారిస్తారు.
3. వెబ్ ల్యాండ్‌లో నమోదు కాని వారు కూడా ఈ పంటలో ఈకర్షక్ యాప్‌లో కూడా ఇన్సూరెన్స్ కోసం పంటల వివరాలు నమోదు చేస్తారు. పంట, రైతు ఫోటోలను సేకరించిన వ్యవసాయ అసిస్టెంట్ ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. పంట వివరాలు, సర్వే నెంబర్ నమోదు సక్రమంగా జరగాలి.
4. ఏపీలో రైతులకు పొలం వద్దనే ఈ ప్రక్రియ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంట నమోదు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పన ఏకకాలంలో చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక్క రూపాయితో ఈ బీమా వర్తిస్తుంది. గతంలో పంట వ్యయంలో ఖరీఫ్ సాగుకు 2 శాతం, రబీ పంటకు 1.5 శాతం చొప్పున చెల్లించాల్సి ఉండేది. కానీ, ఏపీ ప్రభుత్వం దానిని ఉచితంగా అమలు చేస్తోంది. వాణిజ్య, ఉద్యాన పంటలకు రైతులు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
5. పంటల వారీగా బీమా ప్రీమియం చెల్లింపు సమయం ఉంటుంది. ఇవి సీజన్ల వారీగా ఉంటాయి.
6. ఈ పథకంలో చేరాలనుకునే వారు విత్తనం వేసిన 10 రోజుల్లో సంబంధిత వ్యవసాయ అసిస్టెంట్‌ని కలిసి ఫసల్ బీమా యోజన దరఖాస్తు కోరాలి. దానికి సంబంధించిన భూమి పత్రాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అందించాలి.
7. పీఎంఎఫ్ బివై వెబ్‌సైట్‌లో కూడా రైతులు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గుర్తింపు కార్డు, చిరునామా సంబంధిత పత్రం, పట్టాదారు పాసు పుస్తకం అప్‌లోడ్ చేసి ప్రీమియం చెల్లించి పంటల బీమా సదుపాయం పొందవచ్చు.
8. బ్యాంకు ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి ప్రీమియం అందులో భాగంగానే తీసుకుంటున్నారు.


 నష్టపరిహారం పొందే ప్రక్రియ


1. వర్షాలు, వరదలు, వడగళ్ళు లేదా వర్షాభావం కారణంగా పంట నష్టపోయిన నేపథ్యంలో 72 గంటల్లో క్లయిమ్ చేయాలి. పంట నష్టానికి పరిహారం, బీమా కూడా రైతుకు చేరుతుంది. విత్తనం నుంచి కోత దశ వరకూ ఏ సందర్భంలో నష్టం వాటిల్లినా ఇది వర్తిస్తుంది.
2. పంట నష్టం జరిగినట్టు నిర్ధారణ అయిన తర్వాత బీమా మొత్తంలో 25 శాతం రైతుల ఖాతాలో జమ చేస్తారు. 14 రోజుల్లోగా మిగిలిన బీమా మొత్తం చెల్లిస్తారు.
3. పంట నష్టపరిహారం దక్కుతుందనే విషయం తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది క్లయిమ్ చేసుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తమ ప్రాంతం ఏ సాధారణ బీమా కిందకు వస్తుందనేది తెలుసుకోవాలి. తమ పంట బీమా పరిధిలోకి వస్తుందా లేదా అన్నది గుర్తించాలి. అందుకోసం బ్యాంకు సిబ్బందిని సంప్రదించాలి. బ్యాంకులో రుణం తీసుకోని వారు బీమా కంపెనీ నిర్దేశించిన సంస్థను లేదా గ్రామంలో ఆర్బీకే వ్యవసాయ అసిస్టెంట్‌ను సంప్రదించాలి.
4. పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, వ్యవసాయ శాఖ విత్తన పత్రం వంటి వాటి ఆధారంగా క్లయిమ్ జరుగుతుంది. వాటిని సమర్పించి ఆర్బీకే వ్యవసాయ అసిస్టెంట్ సహాయంతో బీమా పొందే అవకాశం ఉంటుంది.


✌ వర్షాధార పంటల కోసం మరో (రెండవది ) బీమా పథకం

✌ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా అందుబాటులో ఉంది. మిర్చి, పత్తి, టమోటా, బత్తాయి పంటలకు ఇది వర్తిస్తుంది.
✌ ఫసల్ బీమా యోజన పథకం కింద లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది.
✌ ఏపీలో రైతు వాటా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే సకాలంలో చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే కేంద్రం కూడా తమ వాటా చెల్లించే అవకాశం ఉండదు. సకాలంలో చెల్లించనప్పుడు పంట నష్టం జరిగితే పరిహారం రైతులకు అందదు.

 

Post a Comment

0 Comments

Close Menu