👉 నాగార్జున"సాగరం"లో ఒడ్డుకు చేరేది ఎవరు ?

 

👉జానారెడ్డి సొంత జాగీర్ తిరిగి గుంజుకుంటాడా !

👉టీ.ఆర్.ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా ?

👉బీజేపీ "దుబ్బాక"లో చూపిన దూకుడు ఇక్కడెందుకు చూపట్లేదు ?

👉కాంగ్రెస్ లో "అధ్యక్ష" కుమ్ములాటకి "సాగర్" ఫలితం మార్గం చూపబోతోందా!



👉 బీజేపీ కేంద్ర పెద్దలు ఇక్కడ ప్రచారానికి వస్తారా?

                నాగార్జున సాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో చలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉండేది ఆ తరువాత నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం గా వచ్చిన అప్పటి నుండి ఇప్పటివరకు 2009, 2014 లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరుపున జానారెడ్డి గారు 2018 ఎన్నికల్లో నోముల నరసింహయ్య టీ.ఆర్.ఎస్ పార్టీ తరుపున గెలవడం జరిగింది.

            ఇటీవల కాలంలో నోముల నరసింహయ్య అకాల మరణంతో ఉపఎన్నికలు జరపవలసిన పరిస్థితి.

👉 జానారెడ్డి జాగీరకు బీటలు తెప్పించిన టీ.ఆర్.ఎస్

              గడిచిన 50 ఏళ్లలో 10 సార్వత్రిక ఎన్నికల్లో  7సార్లు జానారెడ్డి గారు గెలిచిన అసెంబ్లీ స్థానాలు ఒకప్పటి చలకుర్తి ఇప్పటి నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు. అంతటి బలమైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనారెడ్డిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో అతి కీలకమయిన మంత్రిత్వశాఖ కు మంత్రి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అతి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి కూడా జానారెడ్డే.తెలంగాణా తొలి శాసనసభకి  ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా జానారెడ్డే.

               కాంగెస్ పార్టీ క్రమేణా ప్రాభవం కోల్పోవడంతోనో, తెలంగాణా కాంగ్రెస్ లో నాయకత్వ లోపంతోనో, 2018 ఎన్నికల్లో అనూహ్యంగా టీ.ఆర్.ఎస్ అభ్యర్థి నోముల.నరసింహయ్య చేతిలో  కొద్దిపాటి ఓట్ల తేడా తో ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ జానారెడ్డి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పగడ్బందీ ప్రణాళికతో జానారెడ్డి ని ఓడించడం జరిగింది. అప్పటిదాకా జానారెడ్డి జాగీర్ గా చెప్పుకున్న అసెంబ్లీ నియోజకవర్గం లో తొలిసారి బీటలు పడ్డాయి.

                 ఈ ఉపఎన్నికల్లో ఎలాగయినా తన పాత జాగీర్ ని కైవసం చేసుకోవాలని జానారెడ్డి పట్టుదలతో వున్నాడు. తాను ప్రాతినిధ్యం వహించిన సమయాలల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వివరించుకుంటు తనను ఈసారి గెలిపించాలని ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. అంతే కాకుండా అధికార టీ.ఆర్.ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కు సవాళ్లు విసురుతూ ప్రచారం సాగిస్తున్నారు.

                   అధికార బలం, డబ్బు , ప్రలోభాలు లేకుండా ప్రజల్లో ప్రచారం లేకుండా ఎన్నికలకు వెళదాం ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ టీ.ఆర్.ఎస్ పార్టీ దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అని కేసీఆర్ కు దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని ఘాటుగానే సవాలు విసిరారు. ఎన్నికలవేళ్ల రాజకీయ విమర్శలు సాధారణం అయినప్పటికీ జానారెడ్డి తన సొంత నియోజకవర్గంని తిరిగి రెజిక్కించుకుంటారో లేదో వేచి చూడాలి.


👉 TRS  స్థానాన్నినిలుపుకుంటుందా లేదా దుబ్బాక లాగా వదులుకుంటుందా.??  

                  ఎన్నో ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో లో పాతుకుపోయివున్న జానారెడ్డిని మట్టి కరిపించి తొలిసారి 2018లో టీ.ఆర్.ఎస్ జెండా  నోముల నరసింహయ్య ఎగురవేసారు.నోముల మరణంతో తన లోటును తన కుటుంభంతోనే పూడ్చాలి అని నోముల తనయుడు నోముల భగత్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా భగత్ కు అనుభవం లేకున్నా టీ.ఆర్.ఎస్ పార్టీ అండదండలు పుష్కలంగా వుందనేచెప్పాలి.దానికి తోడు బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారందరూ టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరడం వంటివి కలిసొచ్చే అంశాలు.

                ఇటీవల కాలంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో టీ.ఆర్.ఎస్ పార్టీ కాస్త ఏమరుపాటు చూపడంతో ఫలితంగా దుబ్బాక స్థానాన్ని కోల్పోవడం జరిగింది. తన సొంత నిలక్ష్యంతోనో, ప్రత్యర్ధులని తేలికగా తీసుకోవడంలోనో, రకరకాల రాజకీయ సమీకరణాలతోనో టీ.ఆర్.ఎస్ పార్టీ ఓటమిపాలవడం జరిగింది. ఈసారి అలాంటి తప్పులు చేయకూడదు అని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతుంది.

                     తండ్రి మరణంతో బరిలో దిగుతున్న భరత్ కు తండ్రిగారి సెంటిమెంట్ ఎంతవరకు కలిసొస్తుంది? బీజేపీ నుండి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరిన బీజేపీ అసమ్మతి వర్గం ఏమేరకు టీ.ఆర్.ఎస్ కు అనుకూలం అవుతుందో అనేది ఆసక్తికరమైన విషయం. ఏది ఏమైనా అధికార పార్టీకి కాస్త అనుకూలతలు ఎక్కువ అనే చెప్పొచ్చు.


👉  బీజేపీ దూకుడు తగ్గించడానికి కారణం ఏంటి ??

                   సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ నుండి మొదటినుండి టికెట్ ఆశించిన నివేదిత రెడ్డి పార్టీ అధికారికంగా ప్రకటించకు ముందే నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో నివేదిత రెడ్డికి మొండిచేయి చూపించి రవికుమార్ నాయక్ కి పార్టీ టిక్కెట్ కేటాయించడం జరిగింది. అదే కోవలో టికెట్ ఆశించిన అంజయ్య లాంటి మరికొందరు నాయకులు కూడా పార్టీ టిక్కెట్ రాకపోవడంతో వెంటనే టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరిపోడం కూడా జరిగిపోయింది. నివేదిత రెడ్డి లాంటి కొందరు ఆశావహులు మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటున్నారు కానీ రవికుమార్ నాయక్ నామినేషన్ ప్రక్రియలో కానీ ప్రచారంలో కానీ ఎక్కడ కనపడట్లేదు.

                  ఈమధ్యనే దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ వెనువెంటనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో గణనీయంగా ఓట్లను, సీట్లను పెంచుకుంటూ అధికార టీ.ఆర్.ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. అంతటి ఊపుమీద ఉన్న బీజేపీ ఎందుకో ఈ నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో మాత్రం అంతటి దూకుడు చూపట్లేదు. దుబ్బాకలో ఘాటైన విమర్శలు చేస్తూ కేంద్ర పెద్దలు ప్రచారానికి రావడం పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం వారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

                 ఇక పోతే గత 2018 సాదారణ ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన బీజేపీ కేవలం 2675 ఓట్లుతో 1.48% ఓట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది.ఇప్పుడు టికెట్ ఆశించి భంగపడ్డ నివేదిత రెడ్డే అప్పటి బీజేపీ అభ్యర్థి. ఇంత దారుణ ఓటమి తరువాత బీజేపీ అక్కడ దానికి దారులు చూసుకోకుండా, ప్రజలకు అండగా నిలవకుండా,కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం అయిపోయి సమాజికవర్గాలకి మతాలకు మధ్య ఎప్పుడు ఏమి జరుగుద్దా దాన్ని రాజకీయం చేద్దామా అన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది అందుకే ఇక్కడ బీజేపీ పుంజుకోలేకపోతుంది అనేది స్థానిక ప్రజలు అభిప్రాయం.

                 ఇన్నేళ్లలో ఏనాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది లేదుపోనీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు.ఇన్ని కారణాల దృష్ట్యా బీజేపీ సాగరంలో ఒడ్డున చేరగలుగుతుందా అంటే అనుమానమే అంటున్నారు ప్రజలు. మరి గత ఎన్నికల్లో సాధించిన 1.48% ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంటుందా లేదా అన్నదే ప్రధానాంశం.

👉 ఉపఎన్నికలో  నెగ్గితే జానారెడ్డిTPCC అధ్యక్షుడు అవ్వడం ఖాయమా?

                     దుబ్బాక ఉపఎన్నికలో ఘోర ఓటమి తరువాత TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీ అప్పటినుండి అదిగో ఇదిగో అంటూ ఆశావహులు చిరాకు తెప్పిస్తూ సాగదీస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలానికి నాగార్జున సాగర్ ఉపఎన్నిక తరువాత నియమిస్తాం అనడంతో ఇపుడు ఆశావహులంతా ఎలాగైనా సాగర్ ఎన్నికల్లో గెలిచి అధిష్టానం దృష్టిలో పడాలి అని తీవ్రంగా కష్టపడుతున్నారు.

                     ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జానారెడ్డి వైపు మొగ్గు చూపుతోంది అని విశ్వసనీయ సమాచారం.జానారెడ్డి సమర్థుడు, అనుభవిజ్ఞుడు, సీనియర్ అయినప్పటికీ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో కొంత పోటీ ఉందనే చెప్పాలి. పార్టీ క్యాడర్ లో కూడా ఉపఎన్నికలో జానారెడ్డి నెగ్గితెగే కచ్చితంగా ఆయనే TPCC అధ్యక్షుడు అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. అదే జరిగినా పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండబోదు.

👉  కనిపించని బీజేపీ కేంద్ర పెద్దల ఆచూకీ

                    బీజేపీ వెనకబడ్డ రాష్ట్రాలలో ఎక్కడ ఏ చిన్న ఎన్నికలు దగ్గరపడుతున్న జరుగుతున్న హుటాహుటిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు దగ్గరనుండి కేంద్ర మంత్రులతో సహా ప్రచారంలో హడావిడి చేసి ఏదో జరిగిపోతుంది అన్నంత బ్రమ జనాలలో కలిగించేవారు.కానీ ఇక్కడ ప్రచారానికి వస్తారా రారా అనే విషయాన్ని ఎవరు దృవీకరించట్లేదు.బహుశా ఫలితం ముందే ఊహించి ఉండవచ్చు.

                    అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంతో సీనియర్ మరియు రెడ్డి సమాజికవర్గాలకి టికెట్ కేటాయిస్తే, టీ.ఆర్.ఎస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి మరియు చనిపోయిన వారి కుమారుడికి కేటాయిస్తే బీజేపీ మాత్రం గిరిజన సామాజిక వర్గానికి కేటాయించడంలో మతలబు ఏమిటో వారికే తెలియాలి. బలమైన సామాజిక వర్గానికి బలహీన సమాజికవర్గాలకి మధ్య పోటీ పెట్టి ఏమని రాజకీయ కారణాలు చూపుతారో వేచి చూడాలి. బహుశా ఎలాగో ఓడిపోతాం కాబట్టి బలహీన వర్గాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోంది అని చెప్పుకోడానికి కాబోలు.

 

👉 ప్రజానాడి ఎలా ఉంది ??

                   ఈ ఫలితాలు ప్రభుత్వాన్ని మార్చేసే ఎన్నిక కాదు కాబట్టి ప్రధానంగా అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మద్యే పోటీ ఉంటుంది. మిగతా పార్టీలు ఎన్ని ఉన్నా స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కి వ్యక్తిగతంగాను పార్టీ పరంగానూ మంచి అనుకూల పవనాలే వీస్తున్నాయని చెప్పొచ్చు. టీ.ఆర్.ఎస్ అభ్యర్థి నోముల తనయుడు భగత్ కి తండ్రి మరణంతో సానుభూతితో పాటు టీ.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉండటం, దుబ్బాక ఫలితం తరువాత టీ.ఆర్.ఎస్ వ్యూహం మార్చడం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అదనపు బలాలు.బీజేపీ మాత్రం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప చేసేది ఏమిలేదని సర్వేలు కూడా చెపుతున్న వాస్తవం.

                        టీ.ఆర్.ఎస్ పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ని తక్కువ అంచనా వేయలేం కాబట్టి వీరిలో ఎవరు గెలిచినా ఓ మోస్తరు మెజారిటీ తోనే గెలవొచ్చు అనేది విశ్లేషకుల అంచనా.

విశ్లేషకులు: ఆర్.కె.శాతరాసి

                                         :+91 9629301038

Post a Comment

0 Comments

Close Menu